వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు: కేంద్ర ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్:
ఇటీవలి పార్టీ ప్లీనరీలో వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్
దీనిపై మీడియాలో వార్తలు చూసి సాయిరెడ్డికి లేఖలు రాసిన ఈసీ
సాయిరెడ్డి నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా మరోమారు లేఖ
ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండాల్సిందేనని వెల్లడి
శాశ్వత అధ్యక్షుడు లేదంటే ఏదేనీ శాశ్వత పదవి వర్తించవని స్పష్టీకరణ
పార్టీలో అంతర్గత విచారణ జరిపి నివేదిక పంపాలని సాయిరెడ్డికి ఆదేశం
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి బుధవారం ఓ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది.
ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని ప్రస్తావించింది.
ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో భాగంగా వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ను ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం వివిధ మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను చూసిన తర్వాత ఈ మాట నిజమేనా? అని నిర్ధారించుకునేందుకు విజయసాయిరెడ్డికి పలుమార్లు లేఖలు రాసిందట.
అయితే ఆ లేఖలకు సాయిరెడ్డి నుంచి స్పందన రాకపోవడంతో ఈ మాట నిజమేనని తాము భావిస్తున్నామని, దీనిపై పార్టీలో అంతర్గత విచారణ జరిపి... అసలు విషయమేమిటో తెలపాలంటూ తాజా లేఖలో సాయిరెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అదే సమయంలో ఏ పార్టీలో అయినా ఓ నేత శాశ్వత అధ్యక్షుడుగా గానీ, ఆ నేతకు శాశ్వత పదవులు గానీ వర్తించవని కూడా స్పష్టం చేసింది.
ఏ పార్టీ ఎన్నికలు అయినా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే జరగాల్సి ఉందని తెలిపింది. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే..
వైసీపీ నిర్ణయం ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు విరుద్ధమేనని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.
ఈ తరహా నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది....

