మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి..! గ్రీన్ విజన్ కార్యక్రమంలో కార్పొరేటర్ గంటా అప్పలకొండ పిలుపు.
జీవకోటికి ప్రాణాధారం చెట్లేనని భీమిలి జోన్ 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ అన్నారు. భీమిలి బ్యాంక్ కోలనీలో ఉన్న విద్యా సాగర స్కూల్ ఇకో క్లబ్ మరియు గ్రీన్ విజన్ సంయుక్తంగా నిర్వహించిన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని భీమిలి జోనల్ కమీషనర్ ఎస్. వెంకట రమణ, 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ నూకరాజు సంయుక్తంగా ప్రారంభించారు. భీమిలి జోన్ 3వ వార్డు నేరళ్లవలస కోలనీలో ఉన్న వుడా పార్క్ లో 100 మొక్కలను నాటి గ్రీన్ విజన్ వారి ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్బంగా జోనల్ కమీషనర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఉంటే అదే మానవాలికి వెయ్యిరెట్ల బలాన్ని సమకూరుస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణం అంతా కలుషితమై మానవాలికి తేరుకోలేని దెబ్బతీస్తుందని అన్నారు. పూర్వకాలంలో ఎక్కడ చూసిన అడవులు, చెట్లు విపరీతంగా ఉండేవని అన్నారు. దానికారణంగా మంచి స్వచ్ఛమైన గాలి మానవాలికి అందేదని అన్నారు. కానీ నేటి జనాభా పెరుగుదల, ప్రపంచ దేశాలతో పోటీపడి అభివృద్ధి చేయడం కోసం అడవులను చెట్లను నరకవలసి వస్తుందని అన్నారు. కానీ ప్రతీ ఒక్కరూ ఎక్కడ అయితే ప్లేయిన్ ఏరియా ఉందో అక్కడ మొక్కలు నాటి మీయొక్క ఉదారతను చాటుకోవాలని, భావితరాలకు మీరు ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు కార్పొరేటర్ గంటా అప్పలకొండ పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు మాట్లాడుతూ భూమిమీద ఉండే సమస్త జీవరాసులు సంతోషంగా బ్రతకడానికి కావలసిన పంచభూతాలను దేవుడు మనకు వరంగా ఇచ్చారని, అందులో గాలి ఒకటని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా గాలి కలుషితమై ఉందని, ఇది పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న మాటని అన్నారు. భవిష్యత్ లో పర్యావరణానికి ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఉండటం కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, ఇది విద్యార్థి దశ నుండే మొదలు కావాలని గంటా నూకరాజు అన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని రూపొందించిన విద్యా సాగర పాఠశాల యాజమాన్యం వారికి, గ్రీన్ విజన్ వారికి నాయొక్క ధన్యవాదాలు అని గంటా నూకరాజు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, విద్యా సాగర పాఠశాల యాజమాన్యం కె. శాంతి, స్కూల్ డైరెక్టర్ కె. ఎల్. ఎన్. మూర్తి, గ్రీన్ విజన్ ఫౌండర్ జ్యోతిస్మతి, వాసుపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.

