విశాఖ విమానాశ్రయంలో అప్పన్న విగ్రహం ఏర్పాటు --శారదాపీఠాథిపతి చేతుల మీదుగా ఆవిష్కరణ.

 విశాఖ విమానాశ్రయంలో అప్పన్న విగ్రహం ఏర్పాటు
-శారదాపీఠాథిపతి చేతుల మీదుగా ఆవిష్కరణ.

విశాఖ లోకల్ న్యూస్ :

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిమాన్వితుడైన సింహచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఈ విగ్రహన్ని ఆవిష్కరించారు. తొలిసారిగా స్వామివారి దర్శనం చేసుకున్న  సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలోనే సుందర నగరంగా పేరుగాంచిన విశాఖకు నిరంతరం వేలాది మంది పర్యాటకులు,ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని, వారంతా స్వామిని దర్శించుకోవడానికి ఈ విగ్రహం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అంతేకాకుండా అత్యవసర పనులపై వెళ్లే వారు కూడా స్వామిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. స్వామి వారి క్షేత్రమహిత్యం,చరిత్ర అందుబాటులో ఉంచడం వల్ల దేశ వ్యాప్తంగా అప్పన్న గొప్పతనం తెలుస్తుందన్నారు.విమానాశ్రయంలో విగ్రహం ఏర్పాటు చేసిన ఆలయ ఈవో ఎంవీ సూర్యకళను, ట్రస్టుబోర్డు సభ్యులను స్వరూపానందేంద్ర అభినందించారు. ఆలయ ఈవో సూర్యకళ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ పట్నం రైల్వేస్టేషన్‌తో పాటు, తాజాగా విమానాశ్రయంలో కూడా స్వామి విగ్రహం ఏర్పాటు చేయగలిగామన్నారు.త్వరలో భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో కూడా అప్పన్న విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ట్రస్టుబోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు,దినిష్‌రాజు,దొడ్డి రమణ,ముదుండి రాజేశ్వరి,సతీష్‌,పాత్రుడు, చందు,సువ్వాడ శ్రీదేవి, వంకాయల నిర్మల,రామలక్ష్మీ తదితరులు పాల్గొని పూజలు చేశారు.